News Ticker

Menu

పదోతరగతి పరీక్షల్లో ప్రణాళిక పాటిస్తే10/10

ప్రణాళిక పాటిస్తే10/10

అర మార్కు, ఒక మార్కు ప్రశ్నలు ముఖ్యం
క్రమపద్ధతిలో పఠనం, నోట్సు నిర్వహణ కీలకం
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. ఈ సంవత్సరం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. ప్రధానంగా గతంలో ఉన్నట్లు బిట్‌ పేపర్‌ ఉండదు. అంతర్గత మూల్యాంకనం (20 మార్కులు) కూడా ఉండదు. ఈ మార్పులపై అవగాహన పెంచుకుని గరిష్ఠ మార్కులు సాధించటానికి విద్యార్థులు కృషి చేయాలి; తగిన ప్రణాళికతో పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. ఇందుకు ఉపయోగపడే మెలకువలూ, నిపుణుల సూచనలూ ఇవిగో!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో ఉన్న అంతర్గత మార్కులను తొలగించి పూర్తిగా వంద మార్కులకు పరీక్షలను నిర్వహిస్తోంది. హిందీ మినహా ఒక్కో పేపరును 50 మార్కులకు ఇవ్వనున్నారు. ఈసారి రాయాల్సిన జవాబులు పెరిగాయి. సమయం మాత్రం అంతే ఉంది. కనుక సమయ ప్రణాళికపై దృష్టిపెట్టాలి.
పదికి పది పాయింట్లు సాధించడం అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత కష్టమనిపించవచ్ఛు కానీ ఒక ప్రణాళిక ప్రకారం శ్రద్ధగా చదువుకుంటే అది తేలికే. సీసీఈ విధానంలో సొంత వ్యక్తీకరణలు, అభిప్రాయాలు చెప్పాల్సిన ప్రశ్నలు వస్తాయి. వీటిపై ఏ మాత్రం కంగారుపడకుండా అభ్యసనంలో నేర్చుకున్న అంశాలను రాయాలి. ‘ఇది చదివింది కాదు కదా?’ అని ఆలోచించకూడదు. ఈసారి పేపర్ల వారీగానూ గ్రేడ్లు ఇవ్వనున్నారు. దీంతో ప్రతి పేపర్‌లో ఎక్కువ మార్కులు సాధిస్తే మంచి గ్రేడ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు క్రమపద్ధతిలో చదివితే మంచి మార్కులు సాధించొచ్ఛు ముఖ్యంగా అర మార్కు, ఒక మార్కు ప్రశ్నల విషయంలో విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలను మొత్తం పాఠ్యపుస్తకంలోని ఎక్కడి నుంచైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. క్రమ పద్ధతిలో నోట్సు రాసుకుని చదివితే తేలికగా మార్కులు సాధించవచ్ఛు
ప్రశ్నపత్రం ఇలా..
* ప్రశ్న పత్రం నాలుగు సెక్షన్లుగా ఉంటుంది. అంటే.. ఆబ్జెక్టివ్‌, సూక్ష్మ లఘు, లఘు, వ్యాసరూప ప్రశ్నలుంటాయి.
* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఎలాంటి ఐచ్ఛికాలూ ఉండవు.
* సూక్ష్మ లఘు ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సి ఉంటుంది.
* లఘు ప్రశ్నలకు రెండు, నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఎలాంటి ఐచ్ఛికాలూ ఉండవు.
* వ్యాసరూప ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. 8-10 వాక్యాల్లో సమాధానాలు ఇవ్వాలి.
* సమాధాన పత్రం 24 పేజీలు ఉంటుంది.
* ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా సమయం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- మాసిన శ్రీనివాసరావు, ఈనాడు- అమరావతి
సాంఘిక శాస్త్రం
గతంలో అర మార్కు ప్రశ్నలు ఇరవై ఉండేవి (బిట్‌ పేపర్‌). ఇప్పుడు అరమార్కు ప్రశ్నలు పన్నెండు. గతంలో ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఇచ్చేవారు కనుక సరైన జవాబును ఇచ్చిన ఆప్షన్లలోంచి ‘గుర్తిస్తే’ (రికగ్నిషన్‌) సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రధాన ప్రశ్నపత్రంలో ప్రశ్నలుగా ఇస్తారు కనుక జవాబును ‘పునఃస్మరణ’ (రీ కాల్‌) చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు పునశ్చరణకు ప్రాధాన్యం పెరిగిందని గమనించాలి.
ఇప్పుడు పేపర్ల వారీగా గ్రేడ్లు ప్రకటించబోతున్నారు. అంటే ఏ పేపరుకి ఆ పేపరు 10 పాయింట్లు సాధిస్తేనే ఆ సబ్జెక్టులో 10 పాయింట్లు సాధించినట్లవుతుంది. గతంలో ఒక పేపరులో ఒకట్రెండు మార్కులు తగ్గి ఉన్నా రెండో పేపరులో అవి సరిచేసుకుని మొత్తం మీద 10 పాయింట్లు సాధించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా అవకాశం లేదు. ఇది కూడా విద్యార్ధులకు 10 పాయింట్లు సాధించే విషయంలో వెసులుబాటు తగ్గిన అంశమే.
పరీక్షాపత్రంలో ఇప్పుడొచ్చిన మార్పు ఆయా విభాగాల్లోని ప్రశ్నల సంఖ్యలోనే తప్ప ప్రశ్నల స్వభావంలో కాదని గుర్తించాలి. అంటే పరీక్షాపత్రం తయారయ్యేది పూర్తిగా ‘విద్యా ప్రమాణాల’ ఆధారంగానే. అందుకని ఆయా విద్యాప్రమాణాలకు అనుగుణంగా గతంలో మాదిరే సిద్ధం కావాలి.
పాఠాలకు ఎటువంటి ప్రత్యేక వెయిటేజీ ఉండదు. విద్యాప్రమాణాలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అన్ని పాఠాలూ ముఖ్యమైనవనే అనుకోవాలి. ఆయా విద్యాప్రమాణాలకు అనుగుణంగా ఎక్కడినుంచైనా ప్రశ్న అడగవచ్ఛు రెండు మార్కుల ప్రశ్నలు కూడా ఇప్పుడు సంఖ్య పెంచి 8 చేయడం వల్ల గతంలో కంటే ఎక్కువ భావనలను స్పృశించే అవకాశం పరీక్షకుడికి ఇప్పుడు లభిస్తోంది.అంతగా ముఖ్యం కాదేమో అని అనిపించే భావనలను సైతం ఈసారి వదిలిపెట్టకుండా సిద్ధం కావలసి ఉంటుంది.
* మొదటి విద్యాప్రమాణం - అవగాహన. దీనికింద ఏ అంశం మీదనైనా ప్రశ్నలు రావచ్ఛు జ్ఞాపకం ఉంచుకోవలసిన వివిధ ఫ్యాక్ట్స్‌ను క్రమపద్ధతిలో చదువుకోవడం ద్వారా, చక్కగా రివిజన్‌ చేయడం ద్వారా మాత్రమే దీనిలో పూర్తి మార్కులు సాధించగలం.
* రెండో విద్యా ప్రమాణం - వ్యాఖ్యానించడం. నాలుగో విద్యా ప్రమాణం సమకాలీన అంశాలపై స్పందించడం. వీటికి సంబంధించిన ప్రశ్నలు రావడానికి అవకాశమున్న భావనలు పేపర్‌ -1 నుంచి సుస్థిరాభివృద్ది, అవ్యవస్థీకృత రంగం - స్థితిగతులు, భూతాపం పెరగడం, భూగర్భజలాలు, లింగవివక్ష, ప్రపంచీకరణ ఫలితాలు; పేపర్‌-2 నుంచి యుద్ధాల పరిణామాలు, వియత్నాం యుద్ధం, దేశ విభజన నాటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితి, సంకీర్ణ ప్రభుత్వాలు, సారా వ్యతిరేక ఉద్యమం, భోపాల్‌ విషాదం, సమాచారహక్కు.
* మూడో విద్యాప్రమాణం - సమాచార నైపుణ్యాలు. దీనికి సంబంధించిన పూర్తి మార్కులు సులువుగా సాధించవచ్ఛు ఇందుకోసం పాఠ్యపుస్తకంలోని అన్ని గ్రాఫ్‌లూ, కాలపట్టికలూ, పట్టికలూ అధ్యయనం చేయాలి. ఆయా గ్రాఫ్‌/పట్టిక లోని సమాచారం మీద రాదగిన వివిధ ప్రశ్నలను విద్యార్ధులే తయారు చేసుకుని సాధిస్తే మంచిది. అక్కడ ఉన్న సమాచారానికి అనుబంధంగా పాఠాల్లో ఉన్న విషయాల మీద కూడా ప్రశ్నలు రావచ్ఛు కనుక ఆ కోణంలో కూడా సిద్ధమై ఉండాలి.
* ఐదో విద్యా ప్రమాణం - పట నైపుణ్యాలు. పేపర్‌-1లో భారతదేశ పటం, పేపర్‌-2లో ప్రపంచపటం ఇస్తారు. అన్ని పాఠాల్లో వచ్చే వివిధ ప్రదేశాలను, దేశాలను గతంలో మాదిరే సాధన చేస్తే సరిపోతుంది.
* ఆరో విద్యా ప్రమాణం - ప్రశంస- సున్నితత్వం. దీనికిి సంబంధించి వివిధ అంశాలపై నినాదాలు తయారు చేయమని అడగవచ్ఛు వివిధ సాంఘిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి సూచనలు రాయమని అడగవచ్ఛు వివిధ సంస్థల, వ్యక్తుల కృషిని తెలపమని అడగవచ్ఛు ఇలాంటి ప్రశ్నలకు అనుగుణంగా ఉండే భావనలు పాఠ్యపుస్తకం మొత్తం మీదా కలిపి పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి.
ఉదా: లింగ వివక్ష, హిమాచల్‌లో పాఠశాల విద్యా విప్లవం, వలసదారుల ఇబ్బందులు, ఆహార భద్రతలో పీడీఎస్‌ పాత్ర; ప్రపంచశాంతి, వియత్నాం విజయం, గాంధీజీ మొదలైనవి.
- ఆర్‌. రాఘవరెడ్డి
ఇంగ్లిష్‌
ఇంగ్లిషులో 10/10 తెచ్చుకోవటం గతంలో మాదిరి సులువు కాదు. ఎందుకంటే ప్రశ్నపత్రంలో కొత్తగా చేర్చిన ప్రశ్నలకు గతంలో మాదిరి చాయిస్‌ లేదు. సమాధానాలను జవాబుపత్రంలో రాసేటప్పుడు, ప్రశ్నపత్రంలో ఇచ్చిన వరుస క్రమంలోనే, ఒకే చోట రాయాల్సి ఉంటుంది. లేకుంటే మార్కులు కోల్పోవలసి ఉంటుంది.
కాంప్రహెన్షన్‌: ఈ విభాగంలో గతంలో అన్ని ప్రశ్నలూ ‘wh’ ప్రశ్నలు ఉండేవి. కానీ నూతన పద్ధతిలో 15 ప్రశ్నలకు 11 ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. ఇందులో కనీసం ఆరు ఉన్నతశ్రేణి ఆలోచనావిధానాన్ని ప్రోత్సహించేలా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలు సమాచారాన్నీ, అవగాహననూ పరీక్షించేవిధంగా ఉంటాయి. పాసేజ్‌ మొత్తంపై కనీస అవగాహన అవసరం. ముఖ్యమైన వాక్యాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఆప్షన్లను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సమాధానాలను గుర్తించాలి. passage లోని ముఖ్యమైన expressions కు అర్థం తెలుసుకుంటే comprehension లోని ప్రశ్నల నుంచి మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే!
గ్రామర్‌: దీనిలో ఎక్కువ మార్పులు జరిగాయి. transformation of sentences, direct speech, indirect speech లో ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి. tenses కు వెయిటేజి పెరిగి, editing కు తగ్గింది. cloze test తొలగించారు. articles పై ప్రశ్నలు కొత్తగా చేర్చారు. tenses లో continuous, perfect tense లపై దృష్టిపెట్టండి. articles లో omission of the article చాలా ముఖ్యం.
indirect speech విషయంలో వాక్యాలకు బదులుగా సంభాషణలపై దృష్టి పెట్టండి. గ్రామర్‌కి సంబంధించి text book లోని exercises ను బాగా అభ్యాసం చేయాలి.
ఏ సబ్జెక్టు ఎలా?
creative writing: ఇందులో కొత్తగా చేరిన 5 మార్కుల ప్రశ్నకు ఐచ్ఛికాలు లేవు. ఈ 5 మార్కులు విద్యార్థులకు ప్రశ్నలు తయారుచేయడంలో నైపుణ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. textbook లోని c.reading lessons నుంచి ఒక passage ఇస్తారు. passage లో ఏవైనా 5 expressions అండర్‌లైన్‌ చేస్తారు.అవి answers గా వచ్చే విధంగా 5 ‘wh’ ప్రశ్నలు తయారుచేయాలి.
పేపర్‌- 2 లో...
comprehension విభాగంలో study skillsలో advertisement/poster ను కొత్తగా syllabus లో చేర్చారు. అందుకని add/poster కు సంబంధించిన comprehension ను సాధన చేయాలి. dictionary reference పై నూతనంగా రెండు మార్కులకు ఒక ప్రశ్నను చేర్చారు. ఇచ్చిన పదానికి అర్థం, అర్థంలో వైవిధ్యం, భాషాభాగం, సమానార్థం, వ్యతిరేకార్థం, phrasal verb, collocation, క్రియా రూపాలు, idiomatic expressions పై ప్రశ్నలు ఉంటాయి. దీనికోసం oxford advanced Learner’s Dictionary ఉపయోగించడం మేలు.
creative writing విభాగంలో ‘ Information Transfer’ అనే అంశంపై ఒక ప్రశ్న చేర్చారు. Table, pie chart, bar chart లేదా Tree diagram ఆధారంగా ఈ ప్రశ్న ఇస్తారు. ఇందులో ఇచ్చిన అంకెల రూపంలో ఉండే సమాచారాన్ని paragraph రూపంలోకి మార్పు చేయాలి. సమాధానం లో కనీసం 5 వాక్యాలు ఉండేలా చూసుకోవాలి. 5 వాక్యాలకు 5 మార్కులు ఇస్తారు. వీటిలో కనీసం రెండు లేదా మూడు కంపారిటివ్‌ స్టేట్‌మెంట్స్‌ రాయాలి. సింపుల్‌ ప్రెజెంట్‌ లేదా సింపుల్‌ పాస్ట్‌ టెన్స్‌ వాక్యాలు రాయడం తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం రాయడం తేలికవుతుంది.
- డా. నవులూరి పేరయ్య
గణిత శాస్త్రం
గతంలో బిట్‌ పేపర్‌ ఆఖరు 30 నిమిషాలలో ఇచ్చేవారు. సమయం చాలక చాలా మంది ఏదో ఒక జవాబు గుర్తించేవారు. ఈసారి మొత్తం ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభంలో ఇస్తారు కాబట్టి అన్నింటినీ రాయడానికి వీలుంటుంది.
* ప్రతి పేపరుకూ కేటాయించిన అధ్యాయాలు అన్నింటిలో ఉండే సమస్యలు, ఉదాహరణలు, పటాలు, నిర్మాణాలు మొదటి నుంచీ ప్రణాళికాబద్దంగా అభ్యాసం చేయాలి.
* ప్రతి అధ్యాయంలో ఉండే ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’ వంటివి ఆలోచించి సాధన చేస్తే ఎటువంటి నూతన సమస్య అయినా సులభంగా చేయగలుగుతారు.
* ఎస్‌ఎ-1 పరీక్షలు నూతన పరీక్షావిధానంలోనే నిర్వహిస్తారు. కాబట్టి విద్యార్థులు మొదటి నుంచి ప్రశ్నల స్వభావం అర్థం చేసుకోవడానికీ, కాలం సద్వినియోగం చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది.
* ఈ నూతన పరీక్షావిధానంలో విద్యార్థులు ‘పాస్‌’ కావడానికి సులభమైన ప్రశ్నలతోపాటు, తెలివైన విద్యార్థులు నూతన సమస్యలు సొంతంగా సాధన చేసి మంచి గ్రేడ్లు పొందడానికి వీలుంది.
* గతంలో ఉన్న 20 బిట్ల స్థానంలో ఒక పదం/వాక్యరూపంలో రాయగలిగేవి 12 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో అవేస్థాయి ప్రశ్నలు ఉంటాయి. కాకపోతే విద్యార్థులు ఎ,బి,సి,డి లు నింపకుండా జవాబులు రాయాలి. వీటిలో కొన్ని సమస్యా సాధన, కారణాలు తెలపడం, సూత్రాలు రాయడం, చిన్న బొమ్మలు వేయడం వంటివి ఉంటూ విద్యార్థి తార్కిక ఆలోచననూ, సృజనాత్మకతనూ పరీక్షిస్తాయి. పాఠ్యపుస్తకంలో ఉన్న భావనల ఆధారంగా ఇవి రూపొందిస్తారు. గతంలో బిట్లు రాసిన విధంగానే ఇవి కూడా సులభంగా చేసి జవాబులు రాయవచ్ఛు.
* ఇక అతి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు గతంలో ఇచ్చిన విధంగానే విద్యాప్రమాణాల ఆధారంగా ఇస్తారు.
* విద్యార్థులు ముఖ్యంగా సమయాన్ని మొదటి నుంచీ సద్వినియోగం చేసుకుంటే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్ఛు వ్యాసరూప ప్రశ్నలలో ఛాయిస్‌ (5 ప్రశ్నలకు) ఉంటుంది. కచ్చితంగా 20 మార్కులు తెచ్చుకోవచ్ఛు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పదోతరగతి పరీక్షల్లో ప్రణాళిక పాటిస్తే10/10 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM