ప్రధానోపాధ్యాయుడే జవాబుదారీ...! - టీచర్ల బదిలీలకు చర్యలు వేగవంతం
ప్రధానోపాధ్యాయుడే జవాబుదారీ...! - టీచర్ల బదిలీలకు చర్యలు వేగవంతం
◾ లాగిన్లో మార్పులకు హెచ్ఎం సమ్మతి అవసరం
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. బదిలీలను అత్యంత పారదర్శకంగా చేపట్టడానికి ప్రభుత్వం అనేక నూతన విధానాలను అవలంబించనుందని జిల్లా విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. బదిలీల ప్రక్రియలో ఈసారి అంతిమంగా ప్రధానోపాధ్యాయుడు జవాబుదారీ వహించేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది ఉపాధ్యాయ వర్గంలో చర్చనీయాంశమవుతోంది.
బదిలీలపై అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి
ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. బదిలీలకు సంబంధించి గురువారం జరిగిన
సమీక్షలో కొంత స్పష్టత వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో
బదిలీల ప్రక్రియలో భాగంగా టీచర్ లాగిన్ నుంచి సమాచారం హెచ్ఎం, ఎంఈఓ,
డీవైఈఓ, డీఈఓ లాగిన్లకు చేరాక కూడా కొందరు తిరిగి మార్పు, చేర్పులు
చేసేవారు. అది ఎవరు చేశారు? ఎప్పుడు చేశారనేది ఉన్నతాధికారులకు
తెలిసేదికాదు. కానీ ఈసారి ఏ స్థాయిలో మార్పులు జరిగినా అది ఎవరి లాగిన్లో
జరిగిందో తెలిసిపోతుంది. ఇలా నూతన విధానం అమలు చేయబోతున్నారు. ఒకసారి
టీచర్ లాగిన్ నుంచి తన సర్వీసుకు సంబంధించిన వివరాలు హెచ్ఎం లాగిన్కు
వెళ్లాక తిరిగి ఉపాధ్యాయుడు ఏదైనా మార్పు, చేర్పులకు ప్రయత్నిస్తే
కచ్చితంగా హెచ్ఎం చరవాణికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే సదరు టీచర్
మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా హెచ్ఎం లాగిన్లోనే చేయాలి. ఆయన
లాగిన్లో ఏదైనా మార్పులు చేస్తే డీవైఈఓ ఫోన్కు ఓటీపీ వెళ్తుంది. ఇలా
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఉండడంతో ఒకసారి లాగిన్ అయిన తర్వాత
తిరిగి మార్పులు, చేర్పులు చేసుకోవడం టీచర్లకు అసాధ్యమనేది స్పష్టమౌతోంది.
దీంతో ఉపాధ్యాయులు వివరాలను ముందుగా తన లాగిన్లోనే జాగ్రత్తగా నమోదు
చేసుకోవాలి. మొత్తానికి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్యలు
ఊపందుకున్నాయి.జిల్లా విద్యాశాఖ
కార్యాలయాల్లోని కంప్యూటర్ విభాగం ఉద్యోగులకు బదిలీ దరఖాస్తు నమూనాపై
గురువారం అవగాహన కల్పించారు. ఆ నమూనా టీచర్ లాగిన్ నుంచి ఆయా
స్థాయిల్లోని అధికారులకు ఎలా చేరుతుందో వారికి చూపించారు. గతంలో కన్నా ఈ
నమూనా చాలా సులభంగా ఉందని చెబుతున్నారు. లోగడ టీచర్ల సర్వీసుకు సంబంధించి
అనేక అంశాలు ఉండేవి. ఉదాహరణకు పాఠశాల అభివృద్ధికి దాతల నుంచి నిధులు
రాబడితే దానికి సర్వీసు పాయింట్లు కేటాయించేవారు. ప్రస్తుతం అవేమీ లేకుండా
కేవలం తన సర్వీసు, ఏ కేటగిరిలో ఎన్నాళ్లు పనిచేశారో ఆ వివరాల ఆధారంగానే
పాయింట్లు కేటాయించి ఆ మేరకు బదిలీలు చేయడానికి రంగం సిద్ధమవుతోందని
ఉద్యోగవర్గాలు తెలిపాయి.
No Comment to " ప్రధానోపాధ్యాయుడే జవాబుదారీ...! - టీచర్ల బదిలీలకు చర్యలు వేగవంతం "