గేట్-22లో మార్పులు చేసిన అధికారులు - ఏవేని రెండు పేపర్లు రాసుకొనే అవకాశం
ఏవేని రెండు పేపర్లు రాసుకొనే అవకాశం
గేట్-22లో మార్పులు చేసిన అధికారులు
హైదరాబాద్,: ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్)- 2022లో ఈ ఏడాది మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు అడుగనున్నారు. ఇదివరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు (ఎంసీక్యూ), న్యుమరికల్ ఆన్సర్టైప్ క్వశ్చన్లు (ఎన్ఏటీ) ప్రశ్నలను గేట్లో అడగగా, ఈ ఏడాది నుంచి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లు(ఎంఎస్క్యూ)లను అడగనున్నారు. ఎంఎస్క్యూ ప్రశ్నలకు సమాధానాలు రాసేవారు రెండు అంతకు మించి సరైన సమాధానాలను రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 'కిందివాటిలో కంప్యూటర్ భాగాలు ఏవి?' అన్న ప్రశ్నకు A- కీబోర్డు, B- సీపీయూ, C- మానిటర్, D – స్విచ్చ్బోర్డు అన్న ఆప్షన్లు ఇస్తే..
విద్యార్థి A, B, Cలను సమాధానాలుగా రాస్తేనే మార్కులు ఇస్తారు. ఒక్కటి మాత్రమే రాస్తే మార్కులు ఇవ్వరు. ఇలాంటి ప్రశ్నలను సంధించేలా గేట్-22 పరీక్షల్లో మార్పులుచేశారు. విద్యార్థులకు రెండు పేపర్లు రాసుకొనే అవకాశం కూడా కల్పించారు. గతంలో ఎలక్ట్రికల్ వాళ్లు.. ఎలక్ట్రికల్ మాత్రమే రాసేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్తోపాటు బీటెక్లోని మరో సబ్జెక్ట్ను ఎంచుకొని రాయవచ్చు. ఈ ఏడాది కొత్తగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమెటిక్ ఇంజినీర్ కోర్సులను గేట్లో చేర్చారు. దాంతో గేట్లో సబ్జెక్ట్ల సంఖ్య 29కి చేరింది. బీటెక్ పూర్తిచేసినవారితోపాటు బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం గేట్కు హాజరుకావొచ్చు. సిలబస్లోనూ మార్పులుచేశారు
సెప్టెంబర్ నుంచి దరఖాస్తులు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్ను నిర్వహించే అవకాశముండగా, ఐఐటీ ఖరగ్పూర్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి రెండువారాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. గేట్కు హాజరయ్యే విద్యార్థులు మార్పులను జాగ్రత్తగా గమనించాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి సూచించారు. గేట్ సిలబస్ ఇతర పరీక్ష సిలబస్ ఒకే రకంగా ఉండటం వల్ల ఈ పరీక్షకు సన్నద్ధమయ్యేవారికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. గేట్తో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఎంటెక్ పూర్తిచేయడంతోపాటు కొన్ని రకాలైన ప్రభుత్వరంగ సంస్థల్లో నేరుగా ఉద్యోగాలు పొందవచ్చని అన్ అకాడమీ కన్సల్టెంట్ సందీప్ బండారు అభిప్రాయపడ్డారు. మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు గందరగోళానికి గురిచేస్తాయని, విద్యార్థులు క్షుణ్ణంగా చదివిన తర్వాతే సమాధానాలను ఎంపికచేసుకోవాలని సూచించారు
No Comment to " గేట్-22లో మార్పులు చేసిన అధికారులు - ఏవేని రెండు పేపర్లు రాసుకొనే అవకాశం "